బ్యాంక్ లాకర్లో నగలు దాచిన వ్యక్తి చనిపోతే అవి ఎవరికి చెందుతాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేవియర్ సెల్వకుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
బ్యాంక్ లాకర్లో ఆభరణాలు భద్రపరిచినవాళ్లు చనిపోతే అవి ఎవరికి చెందుతాయి? తమిళనాడులో జరిగిన ఓ సంఘటన తర్వాత ఇలాంటి సందేహం తలెత్తింది.
తన భార్య చనిపోవడానికి ముందు బ్యాంకు లాకర్లో ఉంచిన 80 సవర్ల విలువైన ఆభరణాలను తన అనుమతి లేకుండా బంధువులకు అప్పగించారని ఒక విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదు చేశారు.
అయితే ఆ పేరు మీద లాకర్ ఉన్నట్టు ఎలాంటి ఆధారాలూ లేవని బ్యాంకు అధికారులు అంటున్నారు.
ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నారు. ఆయన భార్య బంధువులు కూడా ఈ ఆరోపణను ఖండించారు.
ఈ సంఘటన తర్వాత "బ్యాంకు లాకర్లలో నగలు, సెక్యూరిటీల వంటి వస్తువులను దాచుకున్న వ్యక్తి మరణిస్తే ఆ లాకర్, అందులోని వస్తువులు ఎవరికి చెందుతాయి?" అనే సందేహం తలెత్తింది.

అసలేం జరిగింది?
కోయంబత్తూరులోని సుల్తాన్పేటకు చెందిన 72ఏళ్ల మురుగేశన్ విశ్రాంత ప్రిన్సిపాల్. ఆయన భార్య చాందిని చనిపోయారు. తన భార్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోతనూర్ శాఖ లాకర్లో 80 సవర్ల ఆభరణాలను భద్రపరిచినట్టు తనతో చెప్పారని మురుగేశన్ అంటున్నారు. ఆ ఆభరణాలను బ్యాంకు యాజమాన్యం చట్టబద్ధ వారసుడైన తనకు అప్పగించకుండా తన బంధువులకు ఇచ్చిందని ఆరోపిస్తూ జూలై 16న కోయంబత్తూరు నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ పాఠశాల పీఈటీగా పదవీ విరమణ చేసిన చాందిని 2024 ఆగస్టు 3న మూత్రపిండాల వైఫల్యంతో మరణించారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. తన మరణానికి ముందు తన డబ్బు, నగలు, ఆస్తుల వివరాలను తెలియజేస్తూ ఒకపత్రంపై చాందిని సంతకం చేశారని మురుగేశన్ బీబీసీతో చెప్పారు.
పోతనూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్లో 80 సవర్ల ఆభరణాలు ఉన్నాయని ఆ పత్రంలో ఉందని మురుగేశన్ అంటున్నారు. కానీ తన భార్య అప్పచెల్లెళ్లు, వారి భర్తలు, బ్యాంకు మేనేజర్ సహాయంతో వాటిని తీసుకున్నారని మురుగేశన్ తన ఫిర్యాదులో ఆరోపించారు.
మురుగేశన్ దగ్గరున్న పత్రంలో చాందిని, ఇద్దరు సాక్షుల సంతకాలు ఉన్నాయి. అయితే ఆ పత్రంపై సంతకాలు చేసిన సాక్షులను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది కానీ వారు అందుబాటులోకి రాలేదు. లాకర్ ఉందని నిరూపించే బ్యాంకు పత్రాలు తన దగ్గర లేవని మురుగేశన్ అంగీకరించారు.
"మేం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేశాం. ఫిర్యాదుకు ఎలాంటి ఆధారాలు సమర్పించనందున ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు" అని పోతనూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. బ్రాంచ్లో చాందిని పేరుతో ఎలాంటి లాకర్ లేదని బ్యాంకు తమకు లిఖితపూర్వకంగా తెలియజేసిందని కూడా పోలీసులు బీబీసీతో చెప్పారు.
"ఇవి పూర్తిగా అవాస్తవమైన, కల్పిత ఆరోపణలు. ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి" అని చాందిని చెల్లెలు తిల్లై నాయకి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్ని రకాల లాకర్లు ఉంటాయి?
సాధారణంగా బ్యాంకులో లాకర్ ఉన్న వ్యక్తి మరణిస్తే అందులోని వస్తువులను నామినీకి లేదా చట్టపరమైన ప్రక్రియ ఆధారంగా సంబంధిత బంధువులకు అప్పగిస్తామని బ్యాంకు తెలిపింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లాకర్లను నిర్వహించే ఒక అధికారితో బీబీసీ మాట్లాడింది. పేరు వెల్లడించకూడనే షరతుపై ఆ అధికారి వివరాలు అందించారు.
"బ్యాంకు లాకర్ల విషయానికి వస్తే ప్రతి బ్యాంకుకు దాని సొంత ఛార్జీలు, నిబంధనలు ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయంలో లాకర్లు ఖాళీగా ఉంటేనే ప్రాధాన్యతా క్రమంలో కేటాయిస్తారు. వాటికి రుసుములు కూడా వేరుగా ఉంటాయి" అన్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని లాకర్ల రకాలు, పరిమాణాలు, ఛార్జీల వివరాలను కూడా బ్యాంకు అధికారులు తెలియజేశారు. లాకర్లు నాలుగు పరిమాణాలలో ఉంటాయి. చిన్న, మధ్యస్థ, పెద్ద, అతిపెద్ద లాకర్లుంటాయి.
"లాకర్ పరిమాణాన్ని బట్టి వాటి రిజిస్ట్రేషన్ ఫీజులు, వార్షిక చార్జీలు మారతాయి. ఈ ఫీజులు పట్టణ, మెట్రో నగరాల్లో ఎక్కువగాను, గ్రామీణ, చిన్న-పట్టణ ప్రాంతాల్లో తక్కువగాను ఉంటాయి. వీటన్నింటిపై జీఎస్టీ కూడా విధిస్తారు" అని బ్యాంకు అధికారులు వివరించారు.
లాకర్ అద్దె ఆలస్యంగా చెల్లిస్తే ప్రతి త్రైమాసికానికి పదిశాతం అదనపు రుసుము, సంవత్సరానికి 40శాతం గరిష్ఠంగా అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
నగలు ఎవరికి దక్కుతాయి?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ లాకర్లను ఒక వ్యక్తి పేరు మీద గానీ, భార్యాభర్తల ఉమ్మడి ఖాతాలో గానీ, లేదా ఇద్దరి పేర్ల మీద గానీ నిర్వహించుకోవచ్చు.
"ఉమ్మడి లాకర్ అయితే ఇరు పక్షాలు కలిసి గానీ లేదా విడివిడిగా గానీ నిర్వహించుకోవచ్చు. అయితే, ఒకవేళ ఆ లాకర్ ఒక వ్యక్తి పేరు మీద మాత్రమే ఉంటే వాళ్లు తప్పనిసరిగా తన స్థానంలో మరొక వ్యక్తిని నామినీగా చెప్పాలి"
వ్యక్తిగత లాకర్ తీసుకునే ప్రతి ఒక్కరూ ఒక నామినీని తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఆ వ్యక్తి భార్యాభర్తలు లేదా రక్త సంబంధీకులు కానవసరం లేదు. ఆ వ్యక్తికి నమ్మకమైన ఎవరినైనా నామినీగా పెట్టుకోవచ్చు. కానీ వాళ్ల మరణానంతరం మాత్రమే ఆ లాకర్, అందులో ఉంచిన ఏవైనా ఆభరణాలు లేదా ఇతర వస్తువులు నామినీకి అప్పగిస్తారు.
"సాధారణంగా లాకర్ యజమాని వద్ద ఒక తాళంచెవి, దానిని నిర్వహించే బ్యాంకు అధికారి వద్ద మరొక తాళంచెవి ఉంటుంది. ఇద్దరూ ఒకేసారి ఉపయోగించినప్పుడు మాత్రమే లాకర్ను తెరవగలరు. ఈ రెండు తాళంచెవులలో కేవలం ఒకదానితో మాత్రమే దానిని తెరవలేరు" అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి వివరించారు.
మురుగేశన్ చేసిన పోలీసు ఫిర్యాదులోని ప్రధాన ఆరోపణ ఏమిటంటే కోయంబత్తూరులో తన పేరు మీద భార్య లాకర్లో ఉంచిన నగలను ఆమె మరణానంతరం బ్యాంకు అధికారులు ఆమె వారసులైన తనను సంప్రదించకుండా ఇతరులకు ఇచ్చేశారు అని. సంబంధిత బ్యాంకు శాఖ యాజమాన్యం ఈ ఆరోపణను పూర్తిగా ఖండించింది.
"నేను గత మే నెలలోనే ఇక్కడ బాధ్యతలు స్వీకరించాను. పోలీసులు ఇప్పటికే దీని గురించి గత మేనేజర్ను, ఇక్కడి అధికారులను ప్రశ్నించారు. ఫిర్యాదులో పేర్కొన్న మహిళ పేరు మీద ఇక్కడ ఎప్పుడూ లాకర్ లేదని నిర్ధరించారు'' అని పోతనూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ మేనేజర్ మహేశ్వరన్ బీబీసీతో చెప్పారు.
"ఒకవేళ అది ఒక వ్యక్తి నిర్వహించే లాకర్ అయితే , దానికి ఒక నామినీని పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వ్యక్తి మరణించినా, అది వాళ్ల నామినీకే అప్పగిస్తారు. బ్యాంకు పత్రాల్లో నామినీగా చెప్పిన వ్యక్తికి బ్యాంకు యాజమాన్యం దానిని అప్పగిస్తుంది. దానిని చట్టబద్ధ వారసుడికే అప్పగించాలని బ్యాంకుకు ఎలాంటి నిబంధన లేదు" అని బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ మహేశ్వరన్ స్పష్టంచేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)




























