తుర్కియే: రోడ్లపై యుద్ధ ట్యాంకులు, గాల్లో యుద్ధ విమానాలు.. పదేళ్ల కిందట సైనిక తిరుగుబాటు జరిగిన ఆరోజు రాత్రి ఏం జరిగింది?

తుర్కియే, ఎర్దోవాన్, సైనిక తిరుగుబాటు, రాజకీయాలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

రోడ్లపై దూసుకెళ్తున్న యుద్ధ ట్యాంకులు, తుపాకుల మోత, ప్రభుత్వ భవనాల మీదుగా ఎగురుతున్న యుద్ధ విమానాలు.. వాటితో పాటు ఏకంగా పార్లమెంటుపై జరిగిన దాడి టీవీలో ప్రత్యక్ష ప్రసారమవుతోంది.

మూడు సైనిక కుట్రలను, మరో రెండు సైనిక జోక్యాలను చవిచూసిన ఆ దేశానికి జులై 15, 2016న జరిగిన ఘటన అనూహ్యమైనది. తుర్కియే పార్లమెంటుపై మునుపెన్నడూ దాడి జరగలేదు.

ఇస్తాంబుల్‌లోని బోస్ఫోరస్ వంతెన అంతకముందెన్నడూ అలాంటి రక్తపాతాన్ని చూడలేదు. ఇప్పుడీ వంతెనను ''జులై 15 అమరవీరుల వంతెన'గా అధికారికంగా పిలుస్తున్నారు.

తిరుగుబాటు యత్నాలకు నిరసనగా అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోవాన్ పిలుపు మేరకు సాధారణ పౌరులు వీధుల్లోకి వచ్చారు.

గుర్తుతెలియని ప్రాంతం నుంచి మొబైల్ యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో టీవీలో మాట్లాడిన ఎర్డోవాన్, ఆ రోజు రాత్రి తన మద్దతుదారులను వీధుల్లోకి రావాలని కోరారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎర్డోవాన్ సందేశాన్ని దేశవ్యాప్తంగా ఉన్న మసీదులు కూడా లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రసారం చేశాయి. ఉదయానికల్లా తిరుగుబాటు ప్రయత్నాలు భగ్నమయ్యాయి.

ఈ సంఘటనలో మొత్తం 253 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 184 మంది సాధారణ పౌరులు ఉన్నారు.

అదే సమయంలో తిరుగుబాటు కుట్రలో పాలుపంచుకున్నారనే ఆరోపణలున్న 34 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ కుట్ర ప్రయత్నం కేవలం కొన్నిగంటలే జరిగినా దాని ప్రభావం మాత్రం చాలా దూరం చేరింది.

తుర్కియే, ఎర్దోవాన్, సైనిక తిరుగుబాటు, రాజకీయాలు

ఫొటో సోర్స్, Getty Images

మారిన రాజకీయాలు

ఈ తిరుగుబాటు విఫలయత్నం గడచిన దశాబ్దంలో తుర్కియే రాజకీయాలను చెప్పుకోదగిన రీతిలో మార్చేసింది. దేశంలో అధికారాన్ని సమతుల్యం చేస్తూ, విదేశాలతో దాని సంబంధాలను పునర్నిర్మించింది.

అమెరికా కేంద్రంగా పనిచేసే ఇస్లామిక్ మతగురువు గులెన్‌కు సంబంధించిన నెట్‌వర్కే ఈ తిరుగుబాటు కుట్రకు కారణమని ప్రభుత్వం ఆరోపించింది.

కానీ, 2024లో చనిపోయేవరకు ఈ ఘటనలో తన ప్రమేయం ఏమీ లేదని గులెన్ ఖండిస్తూ వచ్చారు. సైనిక తిరుగుబాటు యత్నం జరిగిన కొద్ది రోజులకే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

ఈ అత్యవసర పరిస్థితిని ఏడుసార్లు పొడిగిస్తూ 2018 వరకు కొనసాగించారు. ఆ సమయంలో ఆధునిక తుర్కియే చరిత్రలోనే అధికారులు అతిపెద్ద ప్రక్షాళనను ప్రారంభించారు.

ఒకనాడు అధ్యక్షుడు ఎర్డోవాన్‌కు సన్నిహితుడైన ఫతేహుల్లా గులెన్ మత ఉద్యమం తుర్కియే ప్రభుత్వ సంస్థలలోనూ, అధికారగణంలోనూ దశాబ్దాలపాటు ప్రభావం చూపింది.

తిరుగుబాటు ప్రయత్నాల నేపథ్యంలో సీనియర్ మిలిటరీ అధికారులు, జనరళ్లు సహా వేలాది మంది సైనికులపై చర్యలు తీసుకున్నారు.

దీంతోపాటు న్యాయమూర్తులు, ప్రభుత్వ న్యాయవాదులు, పోలీసు అధికారులు, విద్యావేత్తలు, ప్రభుత్వోద్యోగులను అరెస్ట్ చేయడం, తొలగించడం, సస్పెండ్ చేయడం చేశారు.

గులెన్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉందనే ఆరోపణలపై వందలాది ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్థలను మూసివేశారు. అనేక యూనివర్సిటీలు కూడా మూతపడ్డాయి.

ఈ అణచివేత కేవలం తిరుగుబాటు కుట్రదారులుగా అనుమానిస్తున్న వారికి, గులెన్ మద్దతుదారులకు మాత్రమే పరిమితం కాలేదని విమర్శకులు అంటున్నారు. ప్రభుత్వం ఇతర అసమ్మతివాదులను కూడా లక్ష్యంగా చేసుకుందని వారు చెబుతున్నారు.

తుర్కియే, ఎర్దోవాన్, సైనిక తిరుగుబాటు, రాజకీయాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

అధ్యక్షుడి అధికారం బలోపేతం

ఈ ప్రక్షాళన కార్యక్రమం కాలక్రమేణా ప్రభుత్వ సంస్థలలో ఇతర మత సమూహాల ప్రభావం పెరగడానికి దారితీసిందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, ప్రభుత్వ అధికారులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.

తిరుగుబాటు ప్రయత్నం విఫలం కావడం చూపిన అతిపెద్ద రాజకీయ ప్రభావం అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోవాన్ అధికారం మరింత బలపడటం.

పార్లమెంటరీ వ్యవస్థ స్థానంలో శక్తివంతమైన కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని ప్రవేశపెట్టే రాజ్యాంగ మార్పులను 2017లో ఓటర్లు స్వల్ప మెజారిటీతో ఆమోదించారు.

ఈ మార్పులు మరుసటి సంవత్సరం నుంచి అమలులోకి వచ్చి, ప్రధాన మంత్రి పదవిని రద్దు చేయడంతో పాటు, అధ్యక్షుడి అధికారాలను విస్తృతం చేశాయి.

ఈ వ్యవస్థ రాజకీయ స్థిరత్వాన్ని పెంచుతుందని, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేస్తుందని, పరిపాలనను మరింత సమర్థవంతంగా చేస్తుందని దీని మద్దతుదారులు చెబుతున్నారు.

మరోవైపు, ఇది అధ్యక్షుడి అధికారాలను మరీ ఎక్కువగా పెంచిందని, తద్వారా ఒకే వ్యక్తి చేతుల్లో గణనీయమైన అధికారాన్ని కేంద్రీకృతమయ్యేలా చేస్తోందని విమర్శకుల అభిప్రాయం.

తుర్కియే, ఎర్దోవాన్, సైనిక తిరుగుబాటు, రాజకీయాలు

ఫొటో సోర్స్, Anadolu via Getty Images

‘స్వయం ప్రతిపత్తి కోల్పోయిన సంస్థలు’

అధ్యక్ష తరహా వ్యవస్థను అమలు చేసినప్పటి నుంచి విధానాల రూపకల్పన, వాటిని ప్రభావితం చేసే ఎంపీల సామర్థ్యం గణనీయంగా బలహీనపడిందని అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ ఫ్రీడమ్ హౌస్ చెబుతోంది.

తుర్కియేపై ఆ సంస్థ తన తాజా నివేదికలో "ఆయన తరచుగా తన అభీష్టానికి వ్యతిరేకంగా పనిచేసే మంత్రిత్వ శాఖలు స్వతంత్ర ప్రభుత్వ సంస్థల పనితీరులో జోక్యం చేసుకుంటారు" అని పేర్కొంది.

ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ దోగన్ సెటింకాయా ఈ అంచనాతో ఏకీభవిస్తూ, అధ్యక్ష తరహా వ్యవస్థ "ఏకపక్ష, అస్పష్ట సంస్థాగత చట్రాన్ని" అందిస్తుందన్నారు.

మానవ హక్కులు, పౌర స్వేచ్ఛ వంటి విషయాల్లో తుర్కియే ప్రభుత్వం చాలా ఏళ్లుగా విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే, తిరుగుబాటు ప్రయత్నం తదనంతర ప్రక్షాళనల తరువాత ఈ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి.

గులెన్ ఉద్యమంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై వేలాది మంది న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను వారి పదవుల నుంచి తొలగించడంతో, న్యాయవ్యవస్థ స్వాతంత్య్రంపై మానవ హక్కుల సంఘాలు, యూరోపియన్ సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేశాయి.

"జులై 15 తర్వాత తుర్కియే రాజకీయ, పరిపాలనా వ్యవస్థలోని అనేక సంస్థలు బలహీనపడి, తమ స్వయంప్రతిపత్తిని కోల్పోయాయి," అని ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ దోగన్ సెటింకాయా అన్నారు.

"న్యాయవ్యవస్థ, పార్లమెంటు ప్రభావవంతమైన అధికార కేంద్రాలుగా తమ పాత్రను పోషించడం మానేశాయి'' అన్నారు దోగన్.

అప్పటి నుంచి అధికారులు తరచుగా సమావేశాలను, నిరసనలను నిషేధిస్తూ, భారీ భద్రతా బలగాలను మోహరించడంతో బహిరంగ ప్రదర్శనలను నిర్వహించడం మరింత కష్టంగా మారింది.

తుర్కియే, ఎర్దోవాన్, సైనిక తిరుగుబాటు, రాజకీయాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

క్షీణించిన పత్రికా స్వేచ్ఛ

పత్రికా స్వేచ్ఛ కూడా క్షీణించింది. మీడియా సంస్థలపై ప్రభుత్వ ప్రభావం పెరిగింది, పలువురు ప్రముఖ పాత్రికేయులపై కేసులు నమోదయ్యాయి.

రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026లో 180 దేశాలలో తుర్కియే 163వ స్థానంలో ఉంది.

ఇక్కడ భావ ప్రకటనా స్వేచ్ఛ కూడా ఒక వివాదాస్పద అంశంగా ఉంది. ఇటీవల, అధ్యక్షుడిని అవమానించారనే ఆరోపణలపై ఒక ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్‌ను అరెస్టు చేశారు.

విచారణలో ఉన్న పాత్రికేయులు, రాజకీయ నాయకులు, ప్రముఖుల సుదీర్ఘ జాబితాలో ఆయన కూడా చేరారు.

"గత దశాబ్ద కాలంలో తుర్కియేలో నిరంకుశ ధోరణులు పెరిగాయి. రాజ్యాంగ మార్పులు, రాజకీయ ప్రత్యర్థులు, స్వతంత్ర పాత్రికేయులు, పౌర సమాజ సభ్యులను జైలులో పెట్టడం ద్వారా అధికారం మరింత కేంద్రీకృతమైంది" అని ఫ్రీడమ్ హౌస్ సంస్థ తెలిపింది.

ఇస్తాంబుల్ మేయర్ ఇక్రమ్ ఇమామోలు 2025 మార్చిలో అరెస్టు అయ్యారు. భవిష్యత్ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఎర్డోగాన్‌కు బలమైన ప్రత్యర్థిగా మారే అవకాశముందని భావిస్తున్నారు.

అవినీతి ఆరోపణలపై ఆయనతోపాటు పలువురు ఇతర అధికారులు కూడా అరెస్టు అయ్యారు. ఇమామోలు , ఆయన సహచరులు ఈ ఆరోపణలను ఖండించారు. విచారణ కొనసాగుతోంది.

2026 మేలో, ఒక కోర్టు తీర్పు ప్రధాన ప్రతిపక్షమైన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ (సీహెచ్‌పీ) ఇమామోలు పార్టీ నాయకత్వాన్ని ప్రభావితం చేసింది. ఈ తీర్పు తరువాత, పార్టీ అధినేత స్థానంలో ఒక మాజీ నాయకుడిని నియమించారు.

ప్రతిపక్షం దీనిని 'న్యాయపరమైన కుట్ర'గా అభివర్ణించింది. అయితే, ప్రజాస్వామ్య విలువలు క్షీణించాయన్న ఆరోపణలను ప్రభుత్వం తిరస్కరిస్తోంది.

తుర్కియే, ఎర్దోవాన్, సైనిక తిరుగుబాటు, రాజకీయాలు

ఫొటో సోర్స్, Getty Images

సైనిక జోక్యానికి చరమగీతం

సైనిక తిరుగుబాటు విఫలం, తదనంతర ప్రక్షాళనల కారణంగా వచ్చిన మార్పులు రాజకీయ స్థిరత్వాన్ని, జాతీయ భద్రతను, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేశాయని ప్రభుత్వం చెబుతోంది.

ప్రభుత్వానికి ముప్పుగా భావించే వ్యక్తులను వ్యవస్థ నుంచి తొలగించడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

"నేను దీనిని కేవలం నియంతృత్వం వైపు వేసే అడుగుగా చూడను. నా దృష్టిలో, ఇది ఆత్మరక్షణ కోసం రాజ్యం అనుసరించే సహజ ప్రవృత్తికి కొనసాగింపు" అని యిల్దిరిమ్ బేయాజిత్ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ నూరి సాలిక్ అన్నారు.

దశాబ్దాలుగా తుర్కియే సైన్యం ముస్తఫా కెమల్ అటాటర్క్ స్థాపించిన లౌకిక గణతంత్రానికి తమను తాము సంరక్షకులుగా భావించుకుంది. రాజకీయ సంక్షోభ సమయాల్లో అది అప్పుడప్పుడు రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంది.

2016లో తిరుగుబాటు ప్రయత్నం అనంతరం, సాయుధ దళాలను మరింత బలమైన పౌర నియంత్రణలోకి తీసుకువస్తూ అనేక నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు.

నియామక, కమాండ్ వ్యవస్థలను మార్చారు. సైనిక అకాడమీలు, సైనిక ఆసుపత్రులు పునర్వ్యవస్థీకరించారు. లేదా మూసివేశారు. అనేక సైనిక విభాగాలు నగరాలకు దూరంగా తరలించారు.

ఈ మార్పులు తుర్కియే రాజకీయాల్లో సైనిక జోక్యం శకానికి సమర్థవంతంగా ముగింపు పలికాయని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు.

"రాజకీయాలను పర్యవేక్షించడానికి, ప్రభావితం చేయడానికి ఒక యంత్రాంగంగా సైన్యం చాలా కాలంగా ఉనికిలో ఉంది" అని ప్రొఫెసర్ నూరి సాలిక్ అంటున్నారు.

"ఆధునిక తుర్కియే చరిత్రలో సైనిక జోక్యాన్ని ప్రజలు మొదటిసారి చురుగ్గా వ్యతిరేకించింది జులై 15న. ఈ కోణంలో, అది ఒక మలుపు" అని ఆయన అంటారు.

తుర్కియే రాజకీయాలను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని సైన్యం ఇప్పుడు "పూర్తిగా కోల్పోయిందని" ఆయన భావిస్తున్నారు.

"అదే అతిపెద్ద మార్పు'' అంటారు ఆయన.

తుర్కియే, ఎర్దోవాన్, సైనిక తిరుగుబాటు, రాజకీయాలు

ఫొటో సోర్స్, Getty Images

విదేశాంగ విధానంలో మార్పులు

సైనిక తిరుగుబాటు ప్రయత్నం తర్వాత తుర్కియే విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

తదనంతర నెలలు సంవత్సరాలలో, అంకారా ఉత్తర సిరియాలో ఇస్లామిక్ స్టేట్, పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్ (వైపీజీ)ని లక్ష్యంగా చేసుకుని మూడు ప్రధాన సైనిక చర్యలను ప్రారంభించింది.

వైపీజీకి కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే) సంబంధాలు ఉన్నాయని తుర్కియే భావిస్తోంది. తుర్కియే, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ పీకేకేని ఒక ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నాయి.

ఇటీవలి సంవత్సరాలలో, పీకేకేతో శాంతి ప్రక్రియను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఈ దిశగా స్పష్టమైన పురోగతి ఏమిటన్నది స్పష్టత లేదు.

తిరుగుబాటు ప్రయత్నం తర్వాత, తుర్కియే విధానాలలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభమైందని ప్రొఫెసర్ నూరి సాలిక్ అంటున్నారు.

"దేశ భద్రత అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది" అని ఆయన అన్నారు.

తుర్కియే కూడా మరింత వైవిధ్యభరితమైన విదేశాంగ విధానాన్ని అవలంబించి, నేటోలో కీలక సభ్యదేశంగా కొనసాగుతూనే రష్యాతో తన సంబంధాలను బలోపేతం చేసుకుంది.

రష్యా నుంచి ఎస్-400 రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయాలన్న నిర్ణయం, తుర్కియే, వాషింగ్టన్ మధ్య ఒక పెద్ద వివాదానికి దారితీసింది. దీని తరువాత, అమెరికా తుర్కియేపై ఆంక్షలు విధించి, దానిని ఎఫ్-35 ఫైటర్ జెట్ కార్యక్రమం నుంచి మినహాయించింది.

అయితే, గత వారం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఈ ఆంక్షలను ఎత్తివేస్తానని చెప్పారు. ఆయన ఎఫ్-35 విమానాల అమ్మకాన్ని పునఃపరిశీలించడానికి కూడా సుముఖత వ్యక్తం చేశారు.

కానీ, అటువంటి ఏ చర్య అయినా అమెరికా కాంగ్రెస్‌లో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు.

మరోవైపు, యూరోపియన్ యూనియన్‌లో చేరడానికి తుర్కియే చాలాకాలంగా చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా పురోగతి సాధించలేదు. 2018 నుంచి ఈయూ సభ్యత్వ చర్చలు దాదాపుగా నిలిచిపోయాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)