సీదిరి అప్పలరాజు అరెస్ట్: యాక్సిడెంట్ కేసు నుంచి కొడుకును తప్పించేందుకు ప్రయత్నించారా?

అప్పలరాజు అరెస్ట్

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసులు బుధవారం (జులై 22) సాయంత్రం అరెస్ట్ చేశారు.

రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడికి సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై ఆయన్ను కేసులో మూడో నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

సీదిరి అప్పలరాజు అరెస్టు కావడంతో...ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు చేరుకోగా, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ప్రస్తుతం పలాసలో పోలీసు పహారా కొనసాగుతోంది.

"మేం రాజకీయాల్లో ఉన్నాం. ఇలాంటివి ఉంటాయని తెలుసు. కానీ, నా కొడుకు మీదకు కూడా రాజకీయాలను తీసుకుని వస్తారని ఊహించలేదు. ఎన్ని కేసులు పెట్టుకున్నా పోరాడతాం.." అంటూ సీదిరి అప్పలరాజు భార్య సీదిరి శ్రీదేవి బీబీసీతో అన్నారు.

మృతుడు దానయ్య కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ నేత, శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించారు.

దానయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని టీడీపీ నాయకులు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలు ఏం జరిగింది?

జులై 10 రాత్రి పలాస-కాశీబుగ్గ ప్రాంతంలోని పాత జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందారు.

మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొనడంతో దానయ్య మరణించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు.

కానీ, ప్రమాదం జరిగిన వెంటనే ఆరవ్ వర్మను కేసు నుంచి కాపాడేందుకు.. సిద్ధార్థ్ అనే మరో యువకుడు ఈ యాక్సిడెంట్ చేసినట్లుగా చూపించే ప్రయత్నాలు జరిగాయన్నది ఆరోపణ.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో.. ‘ప్రమాదం జరిగిన సమయంలో బైక్‌ను సీదిరి ఆరవ్ వర్మ నడిపినట్లు దర్యాప్తులో తేలింది’ అని పేర్కొన్నారు.

జులై 13న పోలీసులు ఆరవ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

అప్పలరాజు అరెస్ట్, పోలీసులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పోలీసుల రిమాండ్ రిపోర్టు

రిమాండ్ రిపోర్టులో ఏముందంటే..

జులై 10వ తేదీ రాత్రి సుమారు 9:30 గంటలకు పలాస మున్సిపాలిటీ పరిధిలోని పాత జాతీయ రహదారిపై ఇండస్ట్రియల్ ఏరియా జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డులు తదితర సాంకేతిక ఆధారాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు.

అక్కుపల్లి జంక్షన్‌లోని శ్రీనివాస ఫిల్లింగ్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీలో ప్రమాద సమయంలో బైక్‌ను ఆరవ్ నడిపినట్లు రికార్డైందని పోలీసులు పేర్కొన్నారు.

అలాగే, ప్రమాదంలో గాయపడిన ఆరవ్ అనంతరం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు అక్కడి సీసీటీవీ దృశ్యాలు నిర్ధరించాయని రిమాండ్ రిపోర్టులో రాశారు.

అదేరోజు రాత్రి 9:34 గంటలకు ఆరవ్ నుంచి సిద్ధార్థ్‌కు ఫోన్ వెళ్లిందని... వారు 22 సెకన్ల పాటు మాట్లాడుకున్నట్లు కాల్ డేటా రికార్డుల్లో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.

ఇద్దరూ ఫోన్ మాట్లాడుకున్న సమయంలో ఆరవ్ ఫోన్ సిగ్నల్ ప్రమాద స్థలం వద్ద ఉండగా, సిద్ధార్థ్ ఫోన్ సిగ్నల్ జీఎంఈ కాలనీలో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు నిర్ధరించాయని పోలీసులు తెలిపారు.

వీటి ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు జులై 13న ఆరవ్ (ఏ1), సిద్ధార్థ్ (ఏ2)లను అరెస్ట్ చేసి, బీఎన్‌ఎస్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

అనంతరం కోర్టు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

సిద్ధార్థ్ తండ్రి, అప్పలరాజు స్నేహితులని... సిద్ధార్థ్, ఆరవ్ మధ్య స్నేహం ఉందని స్థానికులు చెబుతున్నారు.

అప్పలరాజు అరెస్ట్, పోలీసులు

ఫొటో సోర్స్, UGC

మృతుడి కుటుంబంతో రాజీ?

ప్రమాదం జరిగిన తర్వాత తన కుమారుడు ఆరవ్‌ను చట్టపరమైన చర్యల నుంచి తప్పించేందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుట్ర పన్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

"ఆరవ్‌ను చట్టపరమైన చర్యల నుంచి తప్పించేందుకు సిద్ధార్థ్‌ను బైక్ నడిపిన వ్యక్తిగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని అప్పలరాజు ప్రోత్సహించారు. ప్రమాదంలో ఉపయోగించిన బైక్‌ను ఘటనాస్థలం నుంచి తొలగించాలని కూడా సిద్ధార్థ్‌కు సూచించారు. జులై 11న సిద్ధార్థ్ పోలీసుల ఎదుట లొంగిపోయి ఆ ప్రమాదానికి కారణం తానేనంటూ తప్పుడు ప్రకటన ఇచ్చారు. అనంతరం అది వాస్తవం కాదని దర్యాప్తులో తేలింది" అని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

కేసు ఉపసంహరించుకోవడానికి సీదిరి అప్పలరాజు రూ. 8.5 లక్షలకు మృతుడి కుటుంబంతో ఒప్పందం చేసుకున్నారని దర్యాప్తులో తేలిందని, అందులో భాగంగా రూ. 1.5 లక్షలు ముందస్తుగా చెల్లించినట్లు ఆధారాలు లభించాయని పలాస రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ తిరుమలరావు చెప్పారు.

దానయ్య కుటుంబం ఏమంటోంది?

"సీదిరి అప్పలరాజు మనుషులు వచ్చి... మాకు రూ. లక్షన్నర ఇస్తామని చెప్పారు. మరో రూ. 9 లక్షలు కూడా ఇస్తామన్నారు. మా ఆయన పని చేస్తే నెలకు రూ. 9 వేలు వచ్చేవి. కాకపోతే చనిపోయిన మనిషిని తీసుకుని రాలేం కదా, మా కుటుంబానికి ధైర్యం లేకుండా పోయింది" అని మృతుడు దానయ్య భార్య ద్రౌపది బీబీసీతో అన్నారు.

కుట్ర, తప్పుడు సమాచారం ఇవ్వడం, సాక్ష్యాలను మాయం చేయడానికి ప్రయత్నించడం, నిందితుడిని రక్షించడం వంటి ఆరోపణలతో సీదిరి అప్పలరాజుపై బీఎన్ఎస్ సెక్షన్లు 61(2), 238, 240, 242, 249, 49ను కూడా చేర్చినట్లు పొలీసులు కోర్టుకు తెలిపారు.

దీంతో, అప్పలరాజు కూడా అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం మొదలైంది.

అప్పలరాజు అరెస్ట్, పోలీసులు

ఫొటో సోర్స్, UGC

9 రోజుల తర్వాత అరెస్ట్...

సీదిరి ఆరవ్‌కు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన (జులై 13) తొమ్మిది రోజుల తర్వాత (జులై 22) మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు.

నేరాన్ని కప్పిపుచ్చేందుకు కుట్ర పన్నడం, సాక్ష్యాలను మాయం చేయడానికి ప్రయత్నించడం తదితర ఆరోపణలపై నమోదైన కేసులో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కాశీబుగ్గలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

అరెస్టు విషయం తెలిసిన వెంటనే ఆయన నివాసం వద్దకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భారీ పోలీసు బందోబస్తు మధ్య సాయంత్రం సుమారు 7.30 గంటలకు అప్పలరాజును స్టేషన్‌కు తరలించారు.

అప్పలరాజు వాదన ఏమిటి?

స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో అప్పలరాజు మీడియాతో మాట్లాడారు.

తనపై రాజకీయ కక్షతోనే కేసులు నమోదు చేశారని ఆరోపించారు.

రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా చిత్రీకరించారని, తనపై ఇప్పటికే 13 కేసులు పెట్టారని అన్నారు.

రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చని, కానీ, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దని కోరారు.

అప్పలరాజు అరెస్ట్, పోలీసులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, అప్పలరాజును అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు

ఈ కేసులో ఎప్పుడు ఏమైందంటే..

జులై 10-12: ప్రమాదం, దర్యాప్తు

  • పలాస సమీపంలో రోడ్డు ప్రమాదం.
  • గొర్రెల కాపరి దానయ్య మృతి.
  • ప్రమాదానికి తానే కారణమంటూ త్యాడి సిద్ధార్థ్ లొంగుబాటు.
  • ప్రమాదం వెనుక అసలు నిందితుడి గుర్తింపుపై అనుమానాలు.
  • సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు సేకరించించే పనిలో పోలీసులు

జులై 13: ఆరవ్ అరెస్ట్

  • మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ఆరవ్ కాశీబుగ్గ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
  • ఆరవ్ (A1), సిద్ధార్థ్ (A2) లను పోలీసులు అరెస్ట్ చేశారు.
  • కోర్టులో హాజరు, జ్యుడీషియల్ రిమాండ్‌

జులై 14-15: దర్యాప్తులో కొత్త కోణం

  • కేసును మొదట ప్రమాదంగా నమోదు చేసినప్పటికీ, దర్యాప్తులో వచ్చిన వివరాల ఆధారంగా మరిన్ని సెక్షన్లు జోడించారు.
  • సాక్ష్యాల తారుమారు, కుట్ర, పోలీసులను తప్పుదోవ పట్టించడం వంటి ఆరోపణలు నమోదయ్యాయి.
  • మాజీ మంత్రి అప్పలరాజును మూడో నిందితుడిగా (A3) చేర్చారు.

జులై 16-21: అప్పలరాజు పాత్రపై దర్యాప్తు

  • దర్యాప్తులో భాగంగా సీదిరి అప్పలరాజు పాత్రపై పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించారు.
  • అరెస్ట్ తప్పదనే ప్రచారం మొదలైంది.

జులై 22: సీదిరి అప్పలరాజు అరెస్ట్

  • కాశీబుగ్గలోని తన నివాసంలో సీదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
  • సీదిరి అప్పలరాజు అరెస్టుతో పలాసలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)