గుంటూరులో నడిరోడ్డుపై మహిళను వివస్త్రగా చేసి దాడి, 9మంది అరెస్ట్

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

(హెచ్చరిక: ఈ కథనంలోని వివరాలు మిమ్మల్ని కలచివేయవచ్చు).

గుంటూరులో నడిరోడ్డుపై ఓ మహిళను వివస్త్రను చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శనివారం సోషల్‌మీడియాలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.

‘‘జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు ఆస్పత్రికి వెళ్లి కేసు షీట్ తెమ్మన్నారు’’ అని బాధితురాలి భర్త బీబీసీకి చెప్పారు.

‘‘ఈ కేసులో 9మందిని అరెస్ట్ చేశాం. బాధితుల ఫిర్యాదు తీసుకోకుండా కేసు నమోదులో జాప్యం చేసినందుకు సీఐను వీఆర్‌కు పంపాం.శాఖాపరమైన దర్యాప్తు కూడా జరుపుతున్నాం’’ అని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ బీబీసీకి తెలిపారు.

అసలేం జరిగింది?

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బాధితురాలి భర్త బీబీసీకి తెలిపారు. అలాగే పోలీసులతీరు, తదుపరి చర్యల గురించి ఎస్పీ జిందాల్ కూడా వివరించారు.

బాధితురాలి భర్త బీబీసీతో మాట్లాడుతూ "మా కాలనీలో పదిహేనేళ్లుగా మేం నీటి కుళాయిని వినియోగిస్తున్నాం. ఇటీవల దానికి రిపేర్‌ వస్తే చేయించుకున్నాం. అయితే ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం స్థానిక టీడీపీ నాయకుడు మల్లెల వెంకటరమణామూర్తి వచ్చి, 'నాకు తెలియకుండా ఎందుకు రిపేర్‌ చేయించుకుంటున్నారు, కుళాయి వాడుకుంటున్నందుకు రూ. 10 వేలు కట్టండి' అని డిమాండ్‌ చేయడంతో నేను వ్యతిరేకించాను’’ అని వివరించారు.

‘‘పదివేలు ఎందుకు కట్టాలి అని ప్రశ్నించినందుకు నాపై దాడికి యత్నిస్తుంటే, ఇంట్లో ఉన్న నా భార్య ఏదో గొడవ జరుగుతోందని బయటకి వచ్చింది. నాపై దాడి చేస్తున్న రమణమూర్తిని అడ్డుకునే యత్నం చేయడంతో ఆమెను తీవ్రంగా కొట్టారు’’ అని ఆయన చెప్పారు.

‘‘దాడిలో గాయపడిన నా భార్యను తీసుకుని వెంటనే నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాం. కానీ వారు ఫిర్యాదు తీసుకోలేదు. ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఆ కేస్‌షీట్‌ తీసుకురావాలని చెప్పారు. దీంతో ఆస్పత్రికి వెళ్లి ఇంటికి వచ్చేశాం. ఆ మధ్యాహ్నం మళ్లీ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లలేదు'' అన్నారు.

‘ట్రాన్స్‌జెండర్ వ్యక్తులతో రాత్రికి మళ్లీ వచ్చారు’

"అక్కడితో గొడవ అయిపోయిందనుకున్నాం. కానీ, రమణమూర్తి అదే రోజు రాత్రి 8.30 గంటల సమయంలో మళ్లీ ఇంటి వద్దకు వచ్చారు. ఈసారి ఆయనతో సహా తొమ్మిది మంది వచ్చారు. ఆ సమయంలో నేను లేను, నా భార్యపై మళ్లీ దాడి చేశారు. ఆమె భయపడి ఇంట్లోకి వెళ్లిపోతుంటే, మూర్తి సోదరితో పాటు ఆయన తన వెంట తీసుకువచ్చిన ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు నా భార్య వెంటపడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రను చేశారు. వదిలిపెట్టాలని ఎంతగా వేడుకున్నా కనికరించలేదు. స్థానిక మహిళలు అడ్డుకుని దుస్తులు అందించారు'' అని బాధితురాలి భర్త బీబీసీతో చెప్పారు.

"ఆ దారుణ ఘటన జరిగిన వెంటనే మళ్లీ నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కువెళ్తే హాస్పిటల్‌లో చికిత్స చేయించుకుని వచ్చిన తర్వాతే ఫిర్యాదు తీసుకుంటామన్నారు. చికిత్స చేయించుకుని పోలీస్‌స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేసే సరికి అర్ధరాత్రి అయింది. దీంతో మరుసటి రోజు గురువారం గుంటూరు ఎమ్మెల్యే మాధవిని కలిశాం. ఎమ్మెల్యే దృష్టికి వెళ్లిన తర్వాతే పోలీసులు స్పందించారు. ఇప్పటికీ నా భార్య గాయాల నుంచి కోలుకోలేదని’’ బాధితురాలి భర్త వివరించారు.

9మందిపై కేసులు, సీఐపై చర్యలు: ఎస్పీ

ఈ ఘటనకి సంబంధించి టీడీపీ నేత వెంకటరమణమూర్తి సహా.. తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ బీబీసీకి వెల్లడించారు.

నిందితులను కోర్టులో హాజరుపర్చగా, కోర్టు రిమాండ్‌ విధించిందన్నారు.

కేసు నమోదులో జాప్యం చేశారనే అభియోగంపై నగరంపాలెం సీఐ సత్యనారాయణను వీఆర్‌కి పంపించినట్టు ఎస్పీ తెలిపారు.

కేసు నమోదులో జరిగిన జాప్యంపై శాఖాపరమైన విచారణ చేస్తున్నామన్నారు.

నిందితుడు రమణమూర్తిని వెంటనే పార్టీ నుంచి సస్సెండ్‌ చేసినట్టు ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రకటించారు.

మరోవైపు నిందితుడు రమణమూర్తి వాదన కోసం బీబీసీ యత్నించింది. అయితే ఈ కేసులో ఆయన కుటుంబసభ్యులు కూడా నిందితులు కావడం, వారు రిమాండ్‌లో ఉండటంతో వివరణ తీసుకోవడం సాధ్యపడలేదు.

కఠిన చర్యలు తీసుకుంటాం: సీఎం చంద్రబాబు

గుంటూరులో జరిగిన సంఘటన గురించి విని తీవ్రంగా కలత చెందినట్లు, తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.

నిందితులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారని, ఇందులో ప్రమేయం ఉన్న పార్టీ కార్యకర్తను సస్పెండ్‌ చేశామని తెలిపారు.

చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేస్తామని, రాజకీయ నేపథ్యం ఉన్నంత మాత్రాన ఏ ఒక్క వ్యక్తికీ రక్షణ లభించదని స్పష్టం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)