కశ్మీర్: స్కూల్ పుస్తకాల్లో 'వేర్పాటువాదులను' కీర్తించేలా పాఠాలు ఉన్నాయా, అధికారుల తాజా ఆదేశాలపై చర్చ ఏంటి?

    • రచయిత, చెరిలాన్ మొలన్, ఆకిబ్ జావీద్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

పుస్తకాల్లో 'అనుచిత, అభ్యంతకర' అంశాలేమైనా ఉన్నాయేమో సమీక్షించాలంటూ కశ్మీర్‌లోని విద్యాసంస్థలకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది పాఠశాలల్లో ఈ ప్రాంత చరిత్రను ఎవరు రూపొందించాలనే చర్చను లేవనెత్తింది.

ఈ ఆదేశాలు గత వారం జారీ అయ్యాయి.

వీటి ప్రకారం స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు తమ వద్ద ఉన్న పుస్తకాలు, రీసర్చ్ పేపర్లు, అకడమిక్ థీసిస్ పరిశోధన పత్రాలను పరిశీలించాల్సి ఉంటుంది.

అందులో "మతపరమైన భావాలు, చట్టాలు, విద్యా విలువలు, విద్యా ప్రమాణాలను" ఉల్లంఘించే అవకాశం ఉన్న అంశాల కోసం సమీక్షించాలి.

ఏవైనా అభ్యంతరకర అంశాలను గుర్తిస్తే ఆయా పుస్తకాల గురించి నివేదించాలని అధికారులు తమ ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఈ ఆదేశాలు చదువుపై నియంత్రణ విధించేందుకు కాదని, చట్టవిరుద్ధమైన వాటిని తొలగించేందుకేనని అధికారులు చెబుతున్నారు.

ఇందులో "ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాద ధోరణులను గొప్పగా చూపించడం లేదా ప్రోత్సహించడం, చట్టబద్ధమైనదిగా చూపించడం లేదా సమర్థించడం" దేశ భద్రతకు హాని కలిగించే ఏ అంశమైనా సరే, వాటిని ఆయా పాఠ్యాంశాల నుంచి తొలగించడమే దీని లక్ష్యమని పేర్కొంటున్నారు.

అయితే, ఈ చర్యను ప్రతిపక్ష పార్టీలు, విద్యావేత్తలు, విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. దీనిని విద్యా స్వేచ్ఛపై దాడిగా, కశ్మీర్ సుదీర్ఘమైన, కల్లోలిత చరిత్రను చెరిపివేసేందుకు చేస్తున్న ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు.

"అభ్యంతకరమైన అంశాలు" అంటే ఏంటి?

కశ్మీర్‌లో దశాబ్దాలుగా సంఘర్షణ జరుగుతోంది. 1980ల చివరి నుంచి కశ్మీర్‌లో దిల్లీ పాలనకు వ్యతిరేకంగా వేర్పాటువాద గ్రూపులు ఆందోళనలు చేశాయి. ఇవన్నీ పాకిస్తాన్ ప్రేరేపితమని భారత ప్రభుత్వం ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఇస్లామాబాద్ తిరస్కరించింది.

2019లో భారత ప్రభుత్వం కశ్మీర్‌కున్న స్వయం ప్రతిపత్తి హోదాను తొలగించి ఈ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. తర్వాత ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ, పౌరహక్కులు కుంచించుకుపోయయాని, ప్రభుత్వ నియంత్రణ పెరిగిందన్నది విమర్శకుల వాదన.

రెండు ప్రభుత్వ పాఠశాలల లైబ్రరీల్లోని పుస్తకాలు వేర్పాటువాద నాయకులను కీర్తించడంతో పాటు జాతీయ వ్యతిరేక భావనలను ప్రోత్సహించేలా ఉన్నాయని జమ్మూ కశ్మీర్‌లో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఆరోపించింది. ఆయా అంశాలను తొలగించాలంటూ బీజేపీ చేసిన నిరసనల పర్యవనసానంగా ఈ ఆదేశాలు వచ్చాయి.

జమ్మూ కశ్మీర్‌కు చెందిన "గొప్ప వ్యక్తుల" జీవిత ఆధారిత పుస్తకాలుగా 2023 నుంచి పాఠశాలల లైబ్రరీల్లో ఉన్న వీటిని ఈ గందరగోళ పరిస్థితుల తర్వాత ఉపసంహరించుకున్నారు.

ఆ పుస్తకాల ప్రచురణతో సంబంధం ఉన్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే వ్యవహారంలో విద్యాశాఖకు చెందిన ఎనిమిది మంది అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

ఆ రెండు పుస్తకాల గురించి వివాదం చెలరేగిన తర్వాత జారీ చేసిన ఈ ఉత్తర్వుల్లో "అభ్యంతకరమైన అంశాలు" అని పేర్కొన్నప్పటికీ, దాని గురించి స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.

మతపరమైన భావాలు లేదా చట్టాలను ఉల్లంఘించే అవకాశం ఉన్నవి, జాతీయ ప్రయోజనాలకు లేదా విద్యా విలువలకు హాని కలిగించే విషయాలు ఇందులోకి వస్తాయని మాత్రమే పేర్కొంది.

అలాగే, పుస్తకాలు భారతదేశంలోని "వయస్సుకు సంబంధించిన" విద్యా మార్గదర్శకాలను అనుసరించాలని అధికారులు జారీ చేసిన ఆదేశాల్లో తెలిపారు.

హక్కులపై దాడి చేస్తున్నారని ఆరోపణలు

పాఠశాలలు, గ్రంథాలయాల్లోని పుస్తకాలను ఒక కమిటీ సమీక్షిస్తుందని పాఠశాల విద్యా డైరెక్టర్ నసీర్ అహ్మద్ వానీ బీబీసీతో చెప్పారు. అయితే, "అభ్యంతరకరమైనది" ఏంటనే దాని గురించి ఆయన స్పష్టత ఇవ్వలేదు.

గతేడాది అధికారులు 25 పుస్తకాలను నిషేధించారు. వాటిలో బుకర్ ప్రైజ్ గ్రహీత, రచయిత అరుంధతీ రాయ్, ఏజీ నురానీ రచనలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకాలు "తప్పుడు వివరణలతో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి" అంటూ వాటిని నిషేధించారు. ఈ నిషేధాన్ని ప్రస్తుతం కోర్టులో సవాల్ చేశారు.

తాజా ఆదేశాలు భారత రాజ్యాంగం కల్పించిన వాక్ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ హక్కుకు విరుద్ధమని రాజకీయవేత్త నూర్ అహ్మద్ బాబా అన్నారు.

చరిత్ర, విద్య, గుర్తింపుపై తీవ్రమైన వివాదాలున్న ఈ ప్రాంతంలో పుస్తకాలను సమీక్షించడం అంటే, "విద్యా స్వేచ్ఛను, ఆమోదయోగ్యమైన వాదనలను నిర్వచించడంలో ప్రభుత్వ పాత్రపై చట్టబద్ధమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది" అని కశ్మీర్ వ్యవహారాలపై అధ్యయనం చేస్తున్న టీచర్ ఒకరు ( ఈయన తన పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు) అన్నారు.

ఈ ఆదేశాలు ప్రభుత్వ నిఘాకు, ప్రజల్లో భిన్నాభిప్రాయాల అణచివేతను సూచిస్తోందని కొంతమంది నాయకులు ఆరోపించారు.

ప్రభుత్వ వాదనేంటి?

ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీనగర్‌లో పుస్తకాల షాపులపై దాడులు చేసి వందల పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ పుస్తకాలు నిషేధిత ఇస్లామిక్ సంస్థ సిద్ధాంతాలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు.

అయితే, ఆ పుస్తకాల్లో కశ్మీర్‌లోని సంఘర్షణ, రాజకీయ అణచివేత గురించి మాత్రమే రాశారని విమర్శకులు అంటున్నారు.

"దేశ వ్యతిరేక" అంశాలపై నిషేధం నెపంతో ప్రభుత్వం చరిత్ర పుస్తకాలను తొలగించలేదని జమ్మూ కశ్మీర్ అప్నీ పార్టీ నాయకుడు అల్తాఫ్ బుఖారీ అన్నారు.

"ఇదంతా మా అకడమిక్ కంటెంట్‌ను మా నుంచి దూరం చేసేందుకు చేస్తున్న పెద్ద కుట్రలా కనిపిస్తోంది" అని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ అధికారులు, బీజేపీ ప్రతినిధులు ఈ ఆరోపణలను ఖండించారు.

ప్రభుత్వ ఉద్దేశం చదువును దూరం చేయడం కాదని, తరగతి గదుల నుంచి వివాదాస్పద అంశాలను తొలగించడమేనని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రతినిధి ఇమ్రాన్ నబీ దార్ అన్నారు.

"విద్యా సంస్థల్లో బోధిస్తున్న వాటి వల్ల అనవసరమైన వివాదాలు తలెత్తకూడదు. అదే ప్రభుత్వం ఆలోచన" అని దార్ అన్నారు.

బీజేపీ ప్రతినిధి సునీల్ సేథీ బీబీసీతో మాట్లాడుతూ, "విద్యా స్వేచ్ఛ పేరుతో వేర్పాటువాదులను కీర్తించడానికి" అనుమతించడం కుదరదని అన్నారు.

"ప్రస్తుతం ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది. మరోసారి పరిస్థితులు అదుపు తప్పేందుకు అవకాశం ఇవ్వకూడదు" అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)