‘పాక్ పాలిత కశ్మీర్‌’ నిరసనల్లో ఇప్పటివరకు 28 మంది మృతి.. అక్కడేం జరుగుతోంది?

పాక్ పాలిత కశ్మీర్, ముజఫరాబాద్, రావలాకోట్, ఉద్రిక్తతలు

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, షాజాద్ మాలిక్
    • హోదా, బీబీసీ ఉర్దూ
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

‘పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌’లోని 'జమ్మూ అండ్ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ'(జేఏఏసీ) ముజఫరాబాద్ వైపు లాంగ్ మార్చ్‌కు పిలుపునివ్వడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి.

అక్కడి అధికార వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మార్చ్‌కు ముందు మంగళవారం జరిగిన ఘర్షణల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

రావలాకోట్ నుంచి ముజఫరాబాద్‌కు బుధవారం లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు యాక్షన్ కమిటీ మొదట ప్రకటించింది.

అయితే, తమ లాంగ్ మార్చ్‌ను జులై 21 వరకు వాయిదా వేస్తున్నట్లు ఆ సంస్థ తర్వాత తెలిపింది. కోర్ కమిటీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ కోర్ కమిటీ సభ్యులు ఆబిద్ షాహీన్ బీబీసీకి తెలిపారు.

పాకిస్తాన్‌కు చెందిన ఒక కీలక వ్యక్తి తమ ప్రతినిధుల బృందంతో సమావేశమై, డిమాండ్ల పరిష్కరానికి హామీ ఇచ్చారని, ఆ తర్వాతే లాంగ్ మార్చ్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

లాంగ్ మార్చ్ పిలుపు నేపథ్యంలో ముందస్తు చర్యగా దాదాపు 4,000 మంది రేంజర్లు, పోలీసులు, ఎఫ్‌సీ సిబ్బందిని ఇప్పటికే మోహరించినట్లు అధికారులు తెలిపారు.

అవామీ యాక్షన్ కమిటీ లాంగ్ మార్చ్‌ను అనుమతించబోమని సీనియర్ పోలీస్ అధికారి సర్దార్ వహీద్ ఖాన్ స్పష్టం చేశారు.

నగరాన్ని పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నామని, రేంజర్లతో పాటు భద్రత సిబ్బందిని మోహరించినట్లు ఆయన బీబీసీతో చెప్పారు.

పాక్ పాలిత కశ్మీర్, ముజఫరాబాద్, రావలాకోట్, ఉద్రిక్తతలు
ఫొటో క్యాప్షన్, ముజఫరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

అయితే, లాంగ్ మార్చ్ కొద్దిరోజుల పాటు వాయిదా పడినప్పటికీ, రావలాకోట్‌లోని వివిధ ప్రాంతాలలో ప్రస్తుతం కొనసాగుతున్న నిరసనలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని కోర్ కమిటీ సభ్యులు ఆబిద్ షాహీన్ స్పష్టం చేశారు.

మీడియా ప్రతినిధులు రావలాకోట్ రాకుండా అధికారులు అప్రకటిత నిషేధం విధించడంతో నగరంలోని పరిస్థితులకు సంబంధించిన వాదనలను స్వతంత్రంగా ధ్రువీకరించడం అసాధ్యంగా మారింది.

పాక్ పాలిత కశ్మీర్, ముజఫరాబాద్, రావలాకోట్, ఉద్రిక్తతలు
ఫొటో క్యాప్షన్, ముజఫరాబాద్‌లో ముమ్మరంగా తనిఖీలు

మంగళవారం మరో 10 మంది మృతి

రావలాకోట్, సుధనోతీలలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో 8 మంది పౌరులు సహా ఒక సైనికుడు, పోలీసు సిబ్బంది ఒకరు మరణించినట్లు సీనియర్ పోలీస్ అధికారి సర్దార్ వహీద్ ఖాన్ బీబీసీకి తెలిపారు.

దాదాపు 450 మంది రేంజర్లతో కూడిన కాన్వాయ్ రావలాకోట్ వైపు వెళ్తుండగా, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ కార్యకర్తలు బైఠక్ బలోచ్ ప్రాంతంలో కాన్వాయ్‌ను అడ్డుకుని రాళ్లు రువ్వడం ప్రారంభించారని స్థానిక అధికారి ఒకరు బీబీసీ ఉర్దూతో చెప్పారు.

నిరసనకారులు కాన్వాయ్‌పై కాల్పులు కూడా జరిపారని ఆయన తెలిపారు. భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరపడంతో ఏడుగురు నిరసనకారులు మరణించగా, ఒక పోలీస్ కూడా మృతి చెందినట్లు చెప్పారు.

జిల్లా అధికార యంత్రాంగం తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనలో మరణించిన వారి మృతదేహాలను నిరసనకారులు తమతో తీసుకెళ్లిపోయారు. కాల్పుల్లో మరికొంతమంది గాయాలపాలయ్యారు.

నిరసనకారులు, భద్రతాదళాలకు మధ్య మరో ఘర్షణ రావలాకోట్‌లో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, భద్రతా సిబ్బంది రోడ్డు క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు నిరసనకారులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక రేంజర్ సైనికుడు మరణించగా, ఎదురుకాల్పుల్లో నిషేధిత సంస్థకు చెందిన ఒక కార్యకర్త మృతి చెందారు.

బీబీసీ ఉర్దూ ఈ వాదనలను స్వతంత్రంగా ధ్రువీకరించలేకపోయింది.

పాక్ పాలిత కశ్మీర్, ముజఫరాబాద్, రావలాకోట్, ఉద్రిక్తతలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నిరసనల కారణంగా ఇప్పటివరకూ 28 మంది చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఈ విషయమై నిషేధిత జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే, ఆ సంస్థతో సంబంధమున్న ఒక సోషల్ మీడియా అకౌంట్ మాత్రం రేంజర్స్ సైనికుడి మరణాన్ని తోసిపుచ్చింది.

ఎక్స్‌లో ఆ కమిటీ చేసిన పోస్ట్‌లో ఇలా రాసింది, "కొందరు తుపాకులు పట్టుకున్న వీడియోలు సోషల్ మీడియా, పాకిస్తానీ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. వారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు"

"మేమే కనుక తుపాకులు పట్టుకోవాల్సి వస్తే, ఇప్పటివరకూ మా నిరాయుధులైన సోదరుల మృతదేహాలను మోయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు" అని ఆ పోస్టులో పేర్కొన్నారు.

మంగళవారం జరిగిన సంఘటనలు, పాక్ పాలిత్ కశ్మీర్‌లో కొద్ది వారాలుగా జరుగుతున్న నిరసనలు, వాటిపై ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఇప్పటివరకు ఐదుగురు పోలీసులు సహా మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

పాక్ పాలిత కశ్మీర్, ముజఫరాబాద్, రావలాకోట్, ఉద్రిక్తతలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, యాక్షన్ కమిటీ మెమొరాండంలో సహజ వనరులపై స్థానికులకు హక్కులు సహా 38 డిమాండ్లు ఉన్నాయి.

లాంగ్ మార్చ్ ఎందుకు, యాక్షన్ కమిటీ డిమాండ్లు ఏమిటి?

యాక్షన్ కమిటీ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇక్కడి అసెంబ్లీ స్థానాలను, అభివృద్ధి నిధులను ఇతర ప్రాంతాలకు మళ్లించడం వల్ల స్థానిక వనరులపై భారం పడుతోంది. అలాగే, ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాన్ని అనుసరించి తమ కార్యకర్తలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడం, క్యారెక్టర్ ధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీలో అడ్డంకులను తొలగించడం, పాకిస్తాన్ రేంజర్ల మోహరింపును నిలువరించడం వంటివి వారి డిమాండ్లలో ఉన్నాయి.

మొత్తం 38 అంశాలతో కూడిన డిమాండ్ల చార్టర్‌లో.. మెరుగైన ఉచిత విద్య, మెరుగైన వైద్యం, ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉంచడం, వ్యాధి నిర్ధరణ సౌకర్యాలను మెరుగుపరచడం; అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటు; ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో కోటాల రద్దు; గోధుమలు, పిండి నాణ్యత పెంపు, గ్రిడ్ స్టేషన్లు; సహజ వనరులపై స్థానికులకు హక్కులు; మంగ్లా డ్యామ్‌కు సంబంధించిన నష్టపరిహార చెల్లింపు; పర్యావరణ అనుకూల జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం; అవినీతి - సిఫార్సుల సంస్కృతికి ముగింపు; పరిపాలనా సంస్కరణలు, యువతకు వడ్డీ లేని రుణాలు, ఉపాధి లేదా నిరుద్యోగ భృతి, పన్ను మినహాయింపులు, వికలాంగులకు ఉద్యోగాల వంటివి ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)